నర్సింహులుపేట, జూలై 26 : ఇటీవల ఖాళీ అయిన క్షేత్ర సహాయకుడి పదవి కోసం ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించడానికి రూ.30 వేలు లంచం అడిగిన ఎంపీడీవోను వరంగల్ ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఉపాధిహామి పథకంలో పనిచేస్తున్న సీనియర్ చెల్లమల్ల వీరన్న క్షేత్ర సహాయకుడి పదవి కోసం దరఖాస్తు చేశారు. ఆ ఉద్యోగం కావాలంటే రూ.30 వేలు ఇవ్వాలని ఎంపీడీవో తాళ్ల ఉపేందర్ డిమాండ్ చేయగా, మొదటి దఫాలో 5 వేలు ఇచ్చిన వీరన్న.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు ఎంపీడీవోకు రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. కాగా ఆ ఎంపీడీవో ఉపేందర్ పై కేసు నమోదు చేసి తనను కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు. అయితే గతంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు కోసం గౌస్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.45 వేలు తీసుకున్నట్లు, అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల లబ్ధిదారుల నుంచి రూ.1.60లక్షలు, పక్కీర తండాకు చెందిన గుగులోతు కిషన్ నుంచి రూ.1.80 లక్షలు లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి అని వరంగల్ ఏసీబీ అధికారులు తెలిపారు.