హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇటీవల ఎన్నికల జరగగా.. నిన్న ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాసనసభకి తాజాగా ఎన్నికైన వారిలో నేనే సీనియర్ నాయకుడినని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేసీఆర్.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్రెడ్డిపై ఘన విజయం సాధించారు. మరోవైపు టీడీపీ, చిన్నాచితక పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసిన కాంగ్రెస్ కు మొత్తం 21 సీట్లురాగా.. అందులో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 19 మాత్రమే.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తుగా ఓడిపోయారు. ముఖ్యంగా సీఎం రేసులో ఉన్న సీనియర్లు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. మరోవైపు టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓడటంతో, ఇప్పుడు కేసీఆర్ అందరి కంటే సీనియర్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నా తర్వాత అసెంబ్లీలో సీనియర్ నాయకుడిగా ఎర్రబెల్లి దయాకర్రావు, రెడ్యానాయక్ ఉన్నారు అని కూడా కేసీఆర్ చెప్పారు.