హైదరాబాద్, జూలై 24 : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న చిత్రం ఫిదా...ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీక్షించారు. అధికారులతో సమీక్షలు, ప్రజా కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే కేసీఆర్ ఓ తెలుగు సినిమాకు ‘ఫిదా’ అయిపోయారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ ప్రేమ కథ ఎంటర్టైనర్ చిత్రం కేసీఆర్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఫిదా సినిమాలో హీరోయిన్గా నటించిన తమిళ సోయగం సాయి పల్లవి భానుమతి పాత్రలో అచ్చం తెలంగాణ అమ్మాయిలా అనిపించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ యాసను ఉపయోగించి ఓ మంచి సినిమా తీసిన దర్శకనిర్మాతలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. వీలున్నప్పుడు ఒకసారి తనను కలవాలంటూ చిత్ర యూనిట్ను కేసీఆర్ ఆహ్వానించారు. సాయి పల్లవి, వరుణ్ తేజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఫిదా’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించారు. ఈ సినిమాలో వరుణ్కు అన్నగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు నటించగా.. సాయి పల్లవికి అత్తగా ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అమ్మ నటించారు. ఫిదా చిత్రంతో నూటికి నూరు మార్కులు కొట్టేసిన సాయి పల్లవి మరో తాజా చిత్రంతో మన ముందుకు రానుంది.