తమిళనాడు, జూలై 19 : తమిళనాడులో ప్రస్తుతం తీవ్ర కరువు నెలకొన్నది. ఢిల్లీలో ఆ రాష్ట్ర రైతులు గత కొన్ని నెలలుగా అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. రైతులకు రుణ మాఫీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ తమిళనాడు ఎమ్మెల్యేలు మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలను ఏకంగా నూరు శాతం పెంచేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో బుధవారం చేసిన ప్రకటన ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే జీతం ప్రస్తుతం రూ.50 వేల నెల జీతం ఉన్న ఎమ్మెల్యేలు ఇక నుంచి లక్షా అయిదు వేలు డ్రా చేయనున్నారు. అంటే నెల జీతం ఏకంగా రూ.50 వేలు ఒక్కసారిగా పెరిగిపోయింది. సాలరీ హైక్ ఒక్కటే కాదు, ఎమ్మెల్యేల పెన్షన్ కూడా పెరిగింది. ఎమ్మెల్యేల పెన్షన్ను రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పెంచేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఫండ్ను కూడా రెండు కోట్ల నుంచి 2.6 కోట్లకు ప్రభుత్వం పెంచింది. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఎంపీల జీతాలు కూడా పెంచాలని ఇవాళ పార్లమెంట్లో సమాజ్వాదీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే..