ముంబైలో విషాదం..

SMTV Desk 2018-07-06 15:03:56  Mumbais Juhu Beach, 3 Boys Drown Off juhu beach, mumbai, juhu beach

ముంబై, జూలై 6: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జుహు బీచ్‌ వద్ద గురువారం సాయంత్రం ఈతకు వెళ్లి గల్లంతైన నలుగురు యువకులలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అంధేరిలోని డీఎన్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్పేహితులు నిన్న సాయంత్రం జుహు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఐదుగురు యువకులు సముద్రంలోకి దిగారు. పెద్ద అల రావడంతో వారిలో నలుగురు నీటిలో మునిగిపోయారని, ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని జుహు పోలీస్‌ స్టేషన్‌ అధికారి వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన నలుగురూ 17ఏళ్ల వయసు వారే. వారిని ఫర్దీన్‌ సౌదాగర్‌, సొహైల్‌ ఖాన్‌, ఫైసల్‌ షేక్‌, నజీర్‌ గాజిగా గుర్తించారు. సురక్షితంగా బయటపడిన యువకుడు 22ఏళ్ల వాసిమ్‌ ఖాన్‌. గల్లంతైన వారి కోసం గురువారం రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించారు. నావికాదళం, తీరప్రాంత రక్షణ దళాలకు చెందిన‌ చేతక్‌ విమానాలతో పాటు నేవీ డైవింగ్‌ బృందం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. నిన్న యువకులు సముద్రంలోకి వెళ్తుంటే స్థానికులు, మత్స్యకారులు వద్దని వారించారని పోలీసులు వెల్లడించారు.