ఢిల్లీ, జూలై 5 : దేశ రాజధాని ఢిల్లీలో అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వం మధ్య తలెత్తిన అధికారాల వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. అయినప్పటికీ కేజ్రీవాల్ సర్కారుకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి మళ్లీ ఆటంకం ఎదురైంది. సుప్రీం తీర్పు చెప్పిన కొన్ని గంట్లోనే ఆప్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. అయితే దీనిని సర్వీస్ విభాగం తిరస్కరించింది. ఇంకా లెఫ్టినెంట్ గవర్నరే ఈ విభాగానికి ఇంఛార్జిగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఆప్ సర్కారుకు మళ్లీ ఆటంకం ఎదురైంది. సర్వీస్ విభాగం చర్యలతో తాము కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు భూ సంబంధ, పోలీసు, పబ్లిక్ ఆర్డర్ మినహా మిగతా అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని తెలిపింది. ఈ మూడు విభాగాలు మాత్రం ఎల్జీ ఆధీనంలో ఉంటాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, అధికారుల నియామకాలు, బదిలీలపై ఎల్జీ సంతకం చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఆయన సంతకం చేస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించనట్లవుతుందని, దానిపై ఆప్ కోర్టుకు వెళ్లొచ్చని సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది.