ఢిల్లీ, జూలై 4 : కేంద్రప్రభుత్వం పార్లమెంట్, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల ప్రక్రియలో స్థిరత్వంతో పాటు ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. తరచూ ఎన్నికలు జరగటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావటంతోపాటు.. అధికారుల బదిలీలతో ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. పార్లమెంటు, శాసన సభలకు జమిలీ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించాలని ఏప్రిల్లో పేర్కొన్న న్యాయ కమిషన్ రాజ్యాంగంలోని రెండు నిబంధనలను సవరించాలని ,వాటిని మెజార్టీ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది. 70 ఏళ్ల ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియలో స్థిరత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయ కమిషన్ సిఫార్సులు వచ్చే వరకు వేచి చూద్దామన్నారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 7,8 తేదీలలో న్యాయ కమిషన్ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది.