ఢిల్లీ, జూలై 4 : అన్నదాతలకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. ఆహారపంట వరి సహా ఖరీప్ పంటల కనీస మద్దతు ధరను పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ వరిపై మద్దతు ధర రూ.200 పెరిగింది. క్వింటాల్ వరి (సాధారణ రకం) మద్దతు ధర రూ. 1,550 నుంచి రూ. 1,750కు పెరిగింది. ఇక గ్రేడ్ ఏ రకం వరి క్వింటాల్ ధర రూ. 1,590 నుంచి రూ. 1,750కి పెంచారు. పత్తి ధర రూ. 4,020 నుంచి రూ. 5,150కి పెంచారు. పప్పుధాన్యాల్లో కందులు క్వింటాల్ ధర రూ. 5,450 నుంచి రూ. 5,675, పెసర్ల ధర రూ. 5,575 నుంచి రూ. 6,975, మినుములు రూ. 5,400 నుంచి రూ. 5,600లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.