ఢిల్లీ, జూలై 2 : భారత అత్యున్నత ధర్మాసనం లోక్పాల్ అంశంపై కేంద్రానికి నేడు ఆదేశాలు జారీ చేసింది. లోక్పాల్ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూచించింది. ఇందుకు గాను 10 రోజుల గడువు ఇచ్చింది. లోక్పాల్ నియామకం కోసం తీసుకోబోతున్న చర్యలపై పది రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్. భానుమతితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. లోక్పాల్ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు గతేడాదిలోనే కేంద్రాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా నియమించకపోవడంతో కామన్ కాజ్ అనే ఎన్జీవో సంస్థ న్యాయస్థానంలో ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం లోక్పాల్ను ఎప్పుడు నియమిస్తారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.. ఇందుకు 10 రోజుల గడువునిస్తూ.. తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది.