పట్నా, జూన్ 30: సాధారణంగా వివాహాలు జరిగేటప్పుడు కొన్ని ఆగిపోవడం చూస్తుంటాం. కట్నకానుకల విషయంలోనో, భోజనాలు సరిగా పెట్టలేదనో, ఏవో చిన్న గొడవలు పెద్దవిగా మారి పెళ్లిళ్లు రద్దు చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ విచిత్ర కారణంతో ఓ వివాహం ఆగిపోయింది. అదేంటంటే.. పిడుగు పడ్డందుకు వరుడు బాగా భయపడ్డాడని, తర్వాత విచిత్రంగా ప్రవర్తించాడని వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. బిహార్లోని సర్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు ప్రవర్తన కారణంగా తాను ఈ పెళ్లి చేసుకోవట్లేదని వధువు అందరి ముందూ చెప్పేసిందని పోలీసులు వెల్లడించారు. అయితే వధువు పెళ్లి వద్దన్నందుకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరుడి తరఫు బంధువులు దీనిపై ఆగ్రహం వ్యక్తంచేయగా, వధువు తరఫు బంధువులు వారిపై దాడి చేశారు. వరుడి కుటుంబసభ్యులపై దాడి చేసినందుకు వధువు తరఫు ముగ్గురు బంధువులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.