ఢిల్లీ, జూన్ 28 : 41ప్రయాణాలు..52 దేశాలు..రూ. 355కోట్లు.. ఇదంతా మన ప్రధాని నరేంద్రమోదీ కోసం భారత ప్రభుత్వం చేసిన వ్యయం. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాని విదేశీ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా వచ్చిన దరఖాస్తుకు పీఎంఓ సమాధానం ఇచ్చింది. బెంగుళూరుకు చెందిన భీమప్ప గదాద్ ప్రధాని విదేశీ ఖర్చుల వివరాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనికి గానూ ప్రధాన మంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం..భారత ప్రధానిగా 2014లో మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మోదీ 41సార్లు విదేశాలకు ప్రయాణించారు. ఇందులో భాగంగా 52 దేశాల్లో పర్యటించారు. 48నెలల కాలంలో 165రోజులు విదేశాల్లోనే బస చేశారు. ఇందుకు గానూ రూ.355కోట్లు ఖర్చయింది. ఈ విషయంపై దరఖాస్తుదారు భీమప్ప స్పందిస్తూ.. " ప్రధాని పర్యటన వివరాలు నా ఆసక్తి కొద్ది అడిగాను. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రధాని విదేశీ పర్యటనకే ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయని కొందరు అంటుంటే విన్నాను. అందుకే ఖర్చుల వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే దరఖాస్తు చేసుకున్నా" అని వ్యాఖ్యానించారు.