ఢిల్లీ, జూన్ 23 : భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు దాయాది దేశంలో పాకిస్థాన్లో అవమానం జరిగింది. ఆయనను గురుద్వారాకు వెళ్లకుండా అక్కడి అధికారులు నిరాకరించారు. ఇస్లామాబాద్ సమీపంలోని పంజా సాహిబ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి గురుద్వారాలో ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. అయితే పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతి లేదని చెప్పి ఆయనను అడ్డుకున్నారు. వాహనంలో నుంచి కిందకు కూడా దిగనియ్యలేదని తెలుస్తోంది. అజయ్ బిసారియాకు ఈ ఏడాదిలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా పాకిస్థాన్ అధికారులు ఆయనను ఇలాగే పంజా సాహిబ్ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు ఛైర్మన్ ఆహ్వానం మేరకు అజయ్ అక్కడికి వెళ్లగా అధికారులు నిలిపేశారు. భద్రతా కారణాల వల్ల గురుద్వారా సందర్శన అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఇలాగే భారత కాన్సులర్ బృందాన్ని కూడా ఏప్రిల్లో గురుద్వారా ప్రవేశం నుంచి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేసింది.