హైదరాబాద్, జూన్ 16 : సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమా కోసం కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఒకటే లుక్ లో కనిపించిన ప్రిన్స్ కాస్త ట్రెండ్ మార్చి అభిమానులకు కనువిందు చేయనున్నాడు. అయితే ఇటీవల మహేష్ ముంబై వెళ్లిరావడంతో.. ఆయన బాలీవుడ్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ఆయన ముంబై ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మహేష్ భార్య నమ్రత క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో.. "ఈ న్యూస్ ఎలా వచ్చిందో తెలియదు కానీ అదంతా తప్పు. మహేష్ బాలీవుడ్ లో నటించే ఆలోచనేదీ ప్రస్తుతం చేయడం లేదు. యూరప్ టూర్ తరవాత ముంబైలో ఆగింది విశ్రాంతి కోసమే తప్ప బాలీవుడ్ ప్రొడ్యూసర్ లను కలవడం కోసం కాదు. మహేష్ ముంబైలో కలిసింది హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలీంని. అది కూడా తన నెక్ట్స్ తెలుగు మూవీ పనిలో భాగంగానే" అంటూ చెప్పేసింది. అలాగే మహేష్ బాబు స్పందిస్తూ.. "ఇప్పటికిప్పుడు హిందీ సినిమాల్లో నటించాలని నేను అనుకోవడం లేదు. అలాగని హిందీ సినిమా చేయకూడదని కాదు. మంచి అవకాశం వస్తే ఆలోచిస్తా. బాలీవుడ్ సినిమా గురించి నేను ఆరాటపడిపోవడం లేదు. ప్రస్తుతం నేను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో.. అలా నేను హ్యాపీగానే ఉన్నాను" అని చెప్పుకొచ్చాడు.