బెంగళూరు, మే 13 : కన్నడ నాట ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 15న నేతల భవితవ్యాలు తేలనున్నాయి. ఒక వైపు సర్వేలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెబుతున్నాయి. హంగ్ ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో హంగ్ ఫలితాలు వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రధాన పార్టీలు ఇప్పటినుంచి తర్జనభర్జన పడుతున్నాయి. ఒకవేళ హంగ్ వస్తే.. జేడీఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచి వ్యూహం సిద్ధం చేస్తోంది. జేడీఎస్ను తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని దళితుడికి అప్పగించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తాము గెలిస్తే.. ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది అధిష్టానమేనంటూ ట్విస్టు ఇచ్చారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేల మాట వినాలని, వారి అభీష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మెలిక పెట్టారు.