పట్నా, మే 13 : ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహంలో కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ రసాభాస చోటు చేసుకుంది. తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్ల వివాహం పట్నాలోని స్ప్రావ్లింగ్ కళాశాల మైదానంలో శనివారం ఘనంగా జరిగింది. వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు.