హైదరాబాద్, ఏప్రిల్ 23 : నాగశౌర్య కథానాయకుడిగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అమ్మమ్మ గారిల్లు" చిత్ర టీజర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా ఆవిష్కరించారు. శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో కె.ఆర్, రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ వి.వి.వినాయక్ విచ్చేసి చిత్ర టీజర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. "నాకు మా అమ్మమ్మ ఇంటితో చాలా అనుబంధం ఉంది. ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు మా అమ్మమ్మ ఇల్లే గుర్తొచ్చింది. కుటుంబాల మధ్య ఎన్ని మనస్పర్థలున్నా అవన్నీ బయటికి కనిపించకుండా ఉంటాం. అమ్మమ్మ బాధపడకూడదని. ఆనాటి జ్ఞాపకాలను మళ్ళీ ఈ చిత్రం గుర్తు చేసింది. ఇవి రేటింగ్ ఇచ్చే సినిమాలు కావు. దయచేసి ఈ సినిమాకు ఎవరూ రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా. షామిలీ మంచి సహనటి. ఈ సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారు. అందరికి ఈ చిత్రం నచ్చుతుందని కోరుకుంటున్నా" అని తెలిపారు.