జైపూర్, ఏప్రిల్ 19 : రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై చతికిలపడింది. ఐపీఎల్ లో భాగంగా నిన్న సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో (కేకేఆర్) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమి చవిచూసింది. కేకేఆర్ జట్టు ఆల్రౌండ్ జోరు చూపించి ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత టాస్ నెగ్గిన కోల్ కతా సారథి కార్తీక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన రాయల్స్ జట్టులో కెప్టెన్ రహానె (36), షార్ట్ (44) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు చావ్లా (1/18), కుల్దీప్ (1/23), నితీష్ రాణా (2/11) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో మొదట రాజస్థాన్ 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్కతా జట్టులో ఉతప్ప (48), దినేశ్ కార్తీక్ (42 నాటౌట్), నితీష్ రాణా (35 నాటౌట్) తో విరుచుకుపడడంతో లక్ష్యాన్ని నైట్రైడర్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు నితీష్ రాణా కు దక్కింది.