న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ళ చిన్నారి అసిఫా భాను ను అతికిరాతంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మానవత్వం మరిచి చేసిన ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసు విచారణను జమ్ముకశ్మీర్ నుంచి చండీగఢ్కు తరలించాలని కోరుతూ కథువా అత్యాచార బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టును కోరారు. విచారణ జమ్ముకశ్మీర్లో చేపడితే కేసును ప్రభావితం చేస్తారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా విచారణకు అంగీకరించారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు దానిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.