భూపాలపల్లి, మార్చి 30: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం సందర్శించారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఆయా శాఖల అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సోరెన్కు మ్యాపుల ద్వారా హరీశ్రావు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం అనంతరం కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు వివరాలను సోరెన్ మంత్రిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతుందని, సాంకేతికంగానూ అద్భుతంగా నిర్మిస్తున్నారని కొనియాడారు. ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తికావాలని, రైతులకు మేలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.