హరారే, మార్చి 15 : వెస్టిండీస్ ఆటగాడు రోవమన్ పావెల్ శతకం కోసం ప్రెస్ బాక్స్ అద్దాన్ని పగలగొట్టాడు. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్క్లబ్ మైదానంలో ఐర్లండ్తో జరిగిన మ్యాచ్లో కరేబియన్ ఆటగాడు రోవమన్ పావెల్ సెంచరీ కోసం ప్రెస్ బాక్స్ అద్దాన్ని పగలగొట్టాడు. ఈ మ్యాచ్లో విండీస్ 52 పరుగులతో ఐర్లండ్పై విజయం సాధించింది. ఐర్లండ్ బౌలర్ కెవిన్ ఒబ్రెయిన్ వేసిన 49వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్గా మలిచి 95 పరుగులు పూర్తిచేసుకున్న పావెల్, ఆ తర్వాతి బంతిని కూడా సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే బంతిని కసితీరా బాదడంతో అది కాస్తా మైదానంలోని ప్రెస్ బాక్స్ అద్దాన్ని బలంగా తాకింది. అంతే.. ఆ దెబ్బకు అద్దం పగిలిపోయింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రెస్ బాక్స్లోకి వెళ్లిన పావెల్ పగిలి అద్దంపై సంతకం చేశాడు. 100 బంతులు ఎదుర్కొన్న పావెల్ 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. పావెల్కు ఇదే తొలి సెంచరీ కాగా, 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగి సెంచరీ సాధించి తొలి విండీస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.