శ్రీనగర్, నవంబర్ 19 : జమ్ము కాశ్మీర్లో మరోమారు ఉగ్రవాదులు చెలరేగిపోయారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన కాల్పులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బందీపోరా జిల్లా చందర్గీర్ గ్రామంలో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని భద్రత దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుగుతుండగా, ఒక్కసారి ఈ బృందంపై ముష్కరులు కాల్పులు జరిపారు. తిరిగి భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. ఇరువర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా హతమైన ఉగ్రవాదుల్లో 26/11 దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బందీపోరా జిల్లాలో ప్రభుత్వం అక్కడ అంతర్జాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.