చెన్నై, నవంబర్ 02 ; దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళనాడులో సినీ హీరోల రాజకీయ ప్రవేశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టడానికి చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఆ మధ్య ఒక సమావేశంలో స్వయంగా విజయ్ తండ్రి, తనను రాజకీయాలలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పైన తీవ్ర స్థాయిలో అభిమానుల నుంచి ఒత్తిడి ఉన్నది. తాజాగా అమ్మ జయలలితకు అత్యంత సన్నిహితుడు, అమ్మ వీలునామాలో కూడా తన రాజకీయ వారసుడు తానేనని పేర్కొన్నట్లు వచ్చినా, హీరో అజిత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని మంగళవారం నుండి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అజిత్ ఈ మధ్య అభిమానులతో సమావేశమయ్యారని సమాచారం. వారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను గురించి అజిత్ కు వివరించి రాజకీయ ప్రవేశం ఆవశ్యకతను తెలిపారని, దీని ద్వారా ఎక్కువ మందికి సేవ చేయవచ్చని తెలిపినట్లు వివరించినట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ విషయంపై అజిత్ స్పందించి, తనకు రాజకీయాలు తెలియవని అలాగే ఇతర హీరోలను తనకు అనుకరించాల్సిన అవసరం లేదని సుతిమెత్తగా తెలిపినట్లు తెలిసింది.