ఒక్కరోజులో భారీగా పెరిగిన బంగారం ధర...!

SMTV Desk 2019-12-16 12:44:58  

బంగారం ధర ఒక్కరోజులో భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.310 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.39,500కు చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గతూ వస్తున్న బంగారం ధర ఒక్క రోజులోనే రూ.300 పైగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాములకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 పెరుగుదలతో రూ.36,220కు చేరింది. ఇక బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.46,700 వద్దనే కొనసాగుతోంది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.18 శాతం తగ్గుదలతో 1,478.45 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.23 శాతం తగ్గుదలతో 16.97 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం రోజున నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.