నన్ను జంతువు కంటే దారుణంగా ఈడ్చుకెళ్లారు: రోజా

SMTV Desk 2019-12-12 14:40:38  

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మార్షల్స్ వ్యవహారంపై మాటల యుద్ధం నడిచింది. ఉదయం సభలోకి వస్తున్న సమయంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ జరిగిన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో సభలో ఇరు పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రశ్నోత్తరాలు కాకుండా.. ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. టీడీపీ హయాంలో తనపట్ల మార్షల్స్ దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ఎమ్మెల్యే రోజా ప్రస్తావించారు. మార్షల్స్ విషయంలో ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు రోజా. టీడీపీ హయాంలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వలేదన్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించామని.. తర్వాత తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్‌తో బయటకు గెంటేశారని గుర్తు చేశారు. గత అసెంబ్లీలో వీడియోలను బయటపెడితే తమతో ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్థమవుతుందన్నారు. తనను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని.. టార్గెట్ చేసి మరీ కక్ష సాధించారని మండిపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని.. దీనిపై చర్చించాలని కోరితే చర్చించకుండా.. కామ సీఎం అన్నానని ఏడాది సస్పెండ్‌ చేశారని.. అప్పుడు కాల్‌మనీకి షార్ట్‌గా కామ అని పెట్టారని.. దానిని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తే అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారని రోజా మండిపడ్డారు. జంతువు కంటే దారుణంగా తనను మార్షల్స్‌ ఈడ్చుకెళ్లారని గుర్తు చేశారు. తన పట్ల దారుణంగా ప్రవర్తించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీలో గట్టిగా అరుస్తున్నారని.. గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించలేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అసెంబ్లీ సమవేశాల్లో సభలో బోండా ఉమా అందరినీ పాతిపెడతానన్న వ్యాఖ్యల్ని రోజా గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే వ్యతిరేకించడమే ఓ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అసలు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా డైలాగ్ చెప్పినట్లుగా..150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని బాబు గొప్పలు చెబుతున్నారని.. వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆయనకు చాదాస్తం పెరుగుతోందని ఎద్దేవా చేశారు.