ఆరు నెలలలో అభివృద్ధి శూన్యం

SMTV Desk 2019-11-30 16:28:21  

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే ఆరు నెలలలో జగన్ పాలనపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై స్పందించిన టీడీపీ యువనేత నారాలోకేశ్ ట్విట్టర్‌లో సంచలన ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

జగన్ అధికారం చేపట్టిన ఈ ఆరు నెలలలో అభివృద్ధి శూన్యం, సంక్షేమం సున్నా, పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ గారు మహిళల్ని మోసం చెయ్యడం, రైతులను దగా చెయ్యడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజమని, వృద్దులకు నెలకు రూ.250, రైతులకు 625 రూపాయిలు ఇస్తున్న జగన్ గారు గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు రూ.8 వేలు ఇస్తూ ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్ టెండర్ పెట్టిన ఘనుడు జగన్ గారు అంటూ అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమాతో సహా చంద్రబాబు గారి హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసారని, ఆరు నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయని అన్నారు.

45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న హామీ ఎగిరిపోయింది. 3 వేల పెన్షన్ పోయింది. రైతు భరోసా 13,500 అని ఇప్పుడు 7,500 ఇస్తున్నారు. అమ్మ ఒడిని ఆంక్షల ఒడిగా మార్చారని విమర్శించారు. మొత్తానికి రత్నాలు వైకాపా నాయకులు మింగి రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారు. ఎంత మంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ గారి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.