రూ.లక్ష పెడితే రూ.కోటి...ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన స్టాక్!

SMTV Desk 2019-11-12 14:41:51  

డబ్బు సంపాదించాలంటే బ్యాంకులు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, వ్యాపారం ఇలా ఎన్నో రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా డబ్బు వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పెట్టిన డబ్బు కొన్ని సందర్భాల్లో పోవొచ్చు కూడా.అందుకే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిస్తేనే దిగాలి. లేదంటే గమ్మున ఉండటం బెస్ట్. అన్ని రకాల స్టాక్స్ లాభాలను అందించలేకపోవచ్చు. అయితే కొన్ని స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడి అందిచాయి. వీటిల్లో సఫారి ఇండస్ట్రీస్ కూడా ఒకటి. ఈ షేరు ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది.సఫారి ఇండస్ట్రీస్ షేరు గత పదేళ్ల కాలంలో ఏకంగా 10,000 శాతానికి పైగా పరుగులు పెట్టింది. ఈ లగేజ్ తయారీ కంపెనీ షేరు ధర 2009లో కేవలం రూ.5గా ఉంది. ఇప్పుడు ఈ షేరు ధర ఏకంగా రూ.558 వద్ద కదలాడుతోంది. అంటే ఏకంగా 11,600 శాతానికి పైగా పరుగులు పెట్టింది.2009లో సఫారి ఇండస్ట్రీస్ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. 2019లో మీ డబ్బు రూ.1.17 కోట్లుగా అయ్యి ఉండేది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,200 కోట్లకు పైగా ఉంది. దేశీ మార్కెట్‌లో ఈ కంపెనీకి వీఐపీ, స్కైబ్యాగ్స్, శాంసనైట్, అమెరికన్ టూరిస్టర్ వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉంది.అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. సఫారి ఇండస్ట్రీస్ షేరు గత ఏడాది కాలంలో నెగటివ్ రిటర్న్స్‌ను అందించింది. ఆర్థిక మందగమన పరిస్థితులు ఇందుకు కారణం. గత ఏడాది కాలంలో ఈ షేరు ధర 25 శాతానికి పైగా పడిపోయింది. 2019 ఆగస్ట్ 9న రూ.481కు పడిపోయింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.గత పదేళ్ల కాలంలో కంపెనీ ఆర్థిక పనితీరు మెరుగుపడుతూ వచ్చింది. దేశీ లగేజ్ ఇండస్ట్రీలో సఫారి ఇండస్ట్రీస్ మూడో అతిపెద్ద బ్రాండ్‌గా కొనసాగుతోంది. 2012లో మేనేజ్‌‌మెంట్‌లో మార్పు వల్ల కంపెనీ ఆదాయం ఆరు రెట్లకు పైగా పెరిగింది. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ఇందుకు కారణం.