బర్మింగ్హామ్: క్రికెట్ చరిత్రలో తొలిసారి ‘వరల్డ్కప్’ గెలిచి ఆనంద డోలికల్లో తేలియాడుతున్న ఇంగ్లండ్.. ఆ సంబురాన్ని డబుల్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఐదు టెస్ట్ల యాషెస్ సిరీస్లో భాగంగా గురువారం నుంచి ఆస్త్రేలియాతో తొలి టెస్ట్ ఆడనుంది. ప్రతిష్టాత్మక ఐసీసీ ‘టెస్ట్ చాంపియన్షిప్’కూ ఇదే తొలి మ్యాచ్ కావడంతో అందరూ ఆసక్తిగా దీనిపై దృష్టిసారించారు. ప్రపంచకప్లో ఇరుజట్ల పెర్ఫామెన్స్ను చూసిన తర్వాత ఈ మ్యాచ్లో ఫేవరెట్ను అంచనా వేయడం కష్టమే అయినా.. ఎడ్జ్బాస్టన్ వేదిక ఇంగ్లండ్కే అనుకూలంగా కనిపిస్తున్నది. పాత మ్యాచ్ల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ గ్రౌండ్లో ఇంగ్లండ్కే ‘ఎడ్జ్’ ఉంది. 2001 యాషెస్ నుంచి ఇక్కడ ఆడిన 11 మ్యాచ్ల్లో గెలిచిన హోమ్ టీమ్.. వరల్డ్కప్ సెమీస్లోనూ ఆసీస్ను ఓడించింది. 2001 నుంచి ఈ గ్రౌండ్లో ఆడిన ప్రతి మ్యాచ్లో కంగారూలకు ఓటమి తప్పలేదు. అలాగే ఆసీస్.. ఇంగ్లండ్లో యాషెస్ గెలిచి దాదాపు 18 ఏళ్ల అవుతోంది. ఈ రికార్డు కూడా ప్రతికూలంగానే కనిపిస్తున్నది. 2001లో చివరిసారి స్టీవ్ వా నేతృత్వంలోని టీమ్ 4–1తో యాషెస్ను సాధించింది. దీంతో ఈ చెత్త రికార్డును తిరగరాయాలని ఆసీస్ భావిస్తుంటే… 2017–18 సిరీస్కు ప్రతికారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. సో.. ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం..!