షుగర్ కంపెనీలు చెరుకు రైతులను మోసం చేయడం సర్వసాధారణం అయిపొయింది. తాజాగా మహారాష్ట్రకు చెందిన గంగఖేడ్ షుగర్ అండ్ ఎనర్జి లిమిటెడ్ కంపెనీ రైతుల పేరున ఏకంగా రూ.5400 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. వారికి తెలియకుండానే వారి భూములను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకుంది. దీంతో ముంబైతో పాటు పర్బని జిల్లాలోని కంపెనీ కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది.
రత్నాకర్ గుత్తే ఈ కంపెనీని ప్రమోట్ చేశారు. పంట, రవాణా స్కీమ్ కింద సుమారు 600 రైతుల భూములను బ్యాంకులకు తనఖా పెట్టి ఏకంగా రూ.5400 కోట్ల రుణం తీసుకుందని గత ఏడాది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దాదాపు రూ.25 లక్షల వరకు రుణం తీసుకున్నట్లు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుండటంతో రైతులు కంగుతిన్నారు. దీంతో రాష్ట్ర పోలీసులు కూడా కంపెనీపై కేసు నమోదు చేశాడు.