తెలంగాణలోని రాఘవపేటలో ఇటీవల విజయయాత్ర నిర్వహించిన బీజేపీ శ్రేణులను పోలీసులు కావాలనే అన్యాయంగా అరెస్ట్ చేశారని నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ లో తన గెలుపును జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నేతలు రాఘవపేటలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ధర్మపురి అవింద్.. పలు పత్రికల క్లిప్పింగ్ లను దానికి జతచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై అరవింద్ ఏకంగా 70,875 ఓట్లతో ఘనవిజయం సాధించారు.