టీంఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వార్మప్ మ్యాచ్ లలో తన పేలవ ప్రదర్శనతో భారత్ జట్టులో కంగారు మరింత పెంచుతున్నాడు. బంగ్లాదేశ్తో కార్డిఫ్ వేదికగా మంగళవారం జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొన్న శిఖర్ ధావన్ పేలవంగా ఒక్క పరుగు వద్దే పెవిలియన్ చేరిపోయాడు. ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ విసిరిన బంతిని అర్థం చేసుకోలేకపోయిన ధావన్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ధావన్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఔటైన విషయం తెలిసిందే. రెండు మ్యాచ్ల్లోనూ అదీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ధావన్ వికెట్ చేజార్చుకోవడం గమనార్హం. శరీరంపైకి దూసుకొచ్చే బంతుల్ని అడ్డుకోవడంలో శిఖర్ ధావన్ గత కొంత కాలంగా విఫలమవుతున్నాడు. ఇది క్రమంగా అతని బలహీనతగా మారిపోతోంది.