అమరావతి: మే 1న ఏపీలో విడుదలకు సిద్దమవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా ప్రెస్ మీట్ ఆదివారం విజయవాడలో నిర్వహించాలని రామ్ గోపాల్ వర్మ సన్నాహాలు చేసుకున్నారు. నోవాటెల్లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఆ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వడం వల్ల భయంతో వారు ప్రెస్ మీట్కు అనుమతి ఇవ్వలేదని వర్మ శనివారం వెల్లడించారు. ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ఆదివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరకున్న వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్టు దాటి బయటకు రానివ్వలేదు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్ ద్వారా వీడియో రూపంలో వెల్లడించారు. వర్మను అడ్డుకోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి? అని ప్రశ్నిస్తూ ఆదివారం విజయవాడలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..? చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’ అని జగన్ ధ్వజమెత్తారు. జగన్ పోస్ట్పై నెటిజన్లు భిన్నంగా స్పం దిస్తున్నారు. ‘నీ రాజకీయ సౌలభ్యం కోసం ఎవడో విజయవాడలో రానియకపోతేయ్ స్పందించావే అదే తెలంగాణాలో 25మంది ఇంటర్ విద్యార్థులు చనిపోతేయ్ నీకు కనిపించలేదా, లేక పిల్లలే కదా అనేన, లేక మన కెసీఆర్ అని వదిలేసావ,లేక కెసీఆర్ని కి బయపడేగా,జలగా’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.