అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతికి నిపుణులు ఎవరూ? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు అన్నారు. కాగా వారిని ఎలా రిక్రూట్ చేసుకున్నారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు. వీప్యాట్ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. వీవీప్యాట్లోని స్లిప్లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని వెల్లడించారు. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. దీనిపై తాను ఛాలెంజ్ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడించారు.