ఇస్లామాబాద్: భారత్ లో జరుగతున్న సార్వత్రిక ఎన్నికలపై పాకిస్తాన్ ప్రధని ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విదేశీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ...కశ్మీర్ అంశంపై శాంతి చర్చలు నిర్వహించాలంటే.. భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బిజెపి గెలిస్తేనే ఆ ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బిజెపి కాకుండా కాంగ్రెస్ గెలిస్తే, కశ్మీర్ అంశంపై శాంతి చర్చలు నిర్వహించేందుకు ఆ పార్టీ భయపడుతుందని ఇమ్రాన్ చెప్పినట్లు తెలుస్తోంది. భారతీయ ముస్లింలు తనకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అని, ఇన్నాళ్లూ వారంతా సంతోషంగానే ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ ముస్లింలు ఆందోళన చెందే పరిస్థితి వచ్చిందన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ తరహాలో భయం, జాతీయవాదం అన్న సిద్ధాంతంతో మోడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఇమ్రాన్ అన్నారు. కశ్మీర్ ఓ రాజకీయ అంశమని, దానికి మిలిటరీ పరిష్కారం లేదన్నారు. పాక్ మిలిటెంట్లు దాడి చేసినప్పుడుల్లా కశ్మీరీలు నష్టపోయారన్నారు. తోటివారితో శాంతి సంబంధాలు కలిగి ఉండడం పాక్కు అవసరమన్నారు.