ఇస్లామాబాద్: పాకిస్తాన్ కు చెందిన ఎఫ్-16 విమానాన్ని ఇలాగె ధ్వంసం చేశామని తాజాగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు సాక్ష్యాలు బయటపెట్టారు. అయితే ఈ ఆధారాలపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ నిశ్శబ్దాన్ని తక్కువగా అంచనావేయొద్దని తాజాగా వ్యాఖ్యానించింది. భారత వైమానిక దళ ప్రకటనపై పాకిస్థాన్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ స్పందించారు. ఎఫ్16పై ఐఏఎఫ్ ఇప్పటికీ ఆధారాలు చూపించలేదు. ఓ అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజం కాదు. ఎఫ్16 యుద్ధ విమానాన్ని కూల్చామని చెబుతున్నారే తప్ప.. అందుకు తగ్గ ఆధారాలను ఇప్పటికీ ప్రదర్శించడం లేదు. మా నిశ్శబ్దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. నిజం ఏంటంటే భారత్కు చెందిన రెండు ఐఏఎఫ్ జెట్లను పాక్ కూల్చింది. ఇందుకు సంబంధించిన శకలాలను కూడా అందరికీ చూపించాం అని గఫూర్ ట్వీట్లో తెలిపారు.