తమిళనాడు రాజకీయాల్లో ఊహించని సంచలనం చోటు చేసుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్కు సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. కమల్ హాసన్ పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో ఉండగా.. ఆ పార్టీ తరపున పోటీ చేసేవారికి రజనీకాంత్ మద్దతును తెలిపారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల రజనీని కలిసిన కమల్.. తన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దానికి స్పందించిన రజనీ మక్కల్ నీది మయ్యమ్ అభ్యర్థులకు మద్దతును ఇస్తున్నానని తెలిపినట్లు కమల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారని.. ‘రేపటి రోజు మనదే’ అంటూ రజనీ తనతో చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. కాగా లోక్సభ ఎన్నికల్లో కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యం పోటీ చేస్తోంది. 39 లోక్సభ, ఉప ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ స్థానాల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీ చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి కమల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.