హైదరాబాద్, మార్చ్ 20: తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ కి లాభమని, బిజెపి గెలిస్తే మోదీకి అని కాని 16 మంది టిఆర్ఎస్ ఎంపిలు గెలిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కెటిఆర్ సమక్షంలో తెరాసలోకి భారీగా చేరికలు జరిగాయి. బోథ్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ అని, ఢిల్లీ గులాంలు కావాలా…. తెలంగాణ గులాబీలు కావాలా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్, బిజెపిలతో ఒరిగిందేమీ లేదని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘటన టిఆర్ఎస్కు దక్కుతుందన్నారు. జైకిసాన్ అనేది వారికి ఒక నినాదం ఉందని… కానీ టిఆర్ఎస్కు ఒక విధానం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీని శాసించి తెలంగాణను తెచ్చుకోవాలంటే 16 ఎంపిలు గెలువాలని తెలంగాణ ప్రజలకు సూచించారు.