న్యూఢిల్లీ, మార్చ్ 15: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవిఎం ఓట్లతో వివిప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 23 పార్టీలకు చెందిన నాయకులు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈసీకి నోటీసులు జరీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎన్ సిపి చీఫ్ శరద్పవార్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎస్ పి, బిఎస్ పి ఎంపిలు రాంగోపాల్యాదవ్, సతీష్ చంద్ర మిశ్రల నేతృత్వంలో 23 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి వినతిపత్రం అందజేశారు. కానీ ఇసి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు, తన స్పందన తెలియజేయాలని ఈసీని ఆదేశించింది.