వాషింగ్టన్, మార్చి 9: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి కి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ భూభాగమైన బాలకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం వారి పౌరులకు హెచ్చరికలు జారి చేసింది. అమెరికా పౌరులెవరూ జమ్ము-కశ్మీర్లో పర్యటించొద్దని ఆదేశించింది. జమ్ములో ఉగ్రవాద దాడులు, స్థానికులు ఆందోళనలు చేస్తున్న కారణంగా తూర్పు లడఖ్ ప్రాంతం, లేహ్ మినహా కశ్మీర్లోని ఏ ప్రదేశానికి వెళ్లొద్దని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ సూచించింది. అలాగే ఉగ్రవాదులను నిర్మూలించే పనిలో ఉన్న భారత భద్రత బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా-పాక్ సరిహద్దులో కనీసం 10 కీ. మీ. ల దూరంలోనే ఆగిపోవాలని వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంగణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తారని ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది.