హైదరాబాద్, మార్చి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఐటీగ్రిడ్ డేటా చోరి వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య యుద్దానికి దారి తీస్తోంది. ఈ వివాదం పట్ల కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ, ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాల వివాదానికి కూడా సిట్ వేసి దర్యాప్తులు చేయించి, వాస్తవాలను బయటకు తెప్పిస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుందని, మరి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా సుమారు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అప్పుడు ఎంత అరిచి చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో జరిగితే సిట్ వేస్తారని, అదే తెలంగాణలో అయితే సిట్(కూర్చోండి) అని ప్రతిపక్షాలను తోక్కేస్తారని మండిపడ్డారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ చీఫ్ జగన్, గవర్నర్ నరసింహన్ను కలిసి ఐటీ గ్రిడ్పై ఫిర్యాదు చేసిన కాసేపటికే తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం అనుమానాలకు దారి తీస్తుందన్నారు.