న్యూయార్క్/ న్యూఢిల్లీ, మార్చ్ 06: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబాని ఈ ఏడాది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 13వ స్థానాన్ని పొందారు. ముకేశ్ అంబాని గతేడాది 19వ స్థానంలో ఉండగా ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరారు. అంబానీ సంపద 2018లో నమోదైన 4010 కోట్ల డాలర్లు నుంచి పెరిగి దాదాపు రూ.3.5 లక్షల కోట్లు (5000 కోట్ల డాలర్లకు) చేరింది. 2016లో హైపర్ టెలికం మార్కెట్లోకి 4జీ ఫోన్లో జియో ప్రారంభించడంతో టెలికం ప్రొవైడర్ల మధ్య ధరల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం 280 మిలియన్ల మంది కస్టమర్లు కలిగి ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో భారత్ కు చోటు దక్కిన 106 మంది ఇండియన్లకు ముకేశ్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలోని టాప్ -100లో నలుగురు భారతీయులు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వాళ్లలో ముకేశ్ అంబానీ ముందువరుసలో నిలువగా.. మిగతా ముగ్గురు విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీ 36వ ర్యాంకు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 82వ ర్యాంకు, అర్సెల్లర్ మిట్టల్, సీఈఓ లక్ష్మీ మిట్టల్ 91వ ర్యాంక్ పొందారు. వీరితోపాటు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా 122వ ర్యాక్, ఆదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ 167వ ర్యాక్, భారతీ ఎయిర్ టెల్ హెడ్ సునీల్ మిట్టల్ 244 ర్యాంక్, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాలక్రుష్ణ 365వ ర్యాంక్ కలిగి ఉన్నారు. ఇక మొదటి స్థానాన్ని అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ చేజిక్కించుకున్నారు. రెండో స్థానంలో బిల్ గేట్స్, మూడో స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు.