న్యూఢిల్లీ, మార్చి 6: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళం ఉగ్రవాద శిభిరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు హతం అయ్యారు అన్న ప్రశ్నకు ఇంకా క్లారిటీ లేదు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత వైమానిక దళం జరిపిన దాడిలో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారన్న విషయంపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు. అసోం లోని ధుబ్రిలో బీఎఎస్ఎఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన, తరువాత ప్రసంగించారు. బాలకోట్లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఐఏఎఫ్ దాడుల్లో ఎంత మంది చనిపోయారో చెప్పాలని కొంత మంది నేతలు, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఈరోజు లేదా రేపటిలోగా సమాధానం లభిస్తుంది. పాకిస్తాన్ నాయకుల హృదయానికి మాత్రమే ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారనే విషయం తెలుస్తుంది. ఎంత మంది చచ్చారు అంటూ మనవాళ్లు పదే పదే అడగటం చూస్తుంటే.. మెరుపు దాడుల తర్వాత వైమానిక దళమే అక్కడికి వెళ్లి శవాలను లెక్కించాలని డిమాండ్ చేసేలా కనిపిస్తోంది" అంటూ ఎద్దేవా చేశారు.
అయితే ఈ దాడికి ముందు బాలకోట్లో 300 సెల్ ఫోన్ లు ఆక్టివ్ గా ఉన్నట్టు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(ఎన్టీఆర్ఓ) చెప్పిన వివరాలను ప్రస్తావిస్తూ, "అధికారిక సంస్థ చెప్పినా కొంత మంది వ్యక్తులు నమ్మడం లేదు. చెట్లు కూలాయా అని ప్రశ్నిస్తున్నారు. చెట్లు మొబైల్ ఫోన్లు వాడతాయో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ ఎన్టీఆర్ఓ చెబుతుంది అబద్ధం అనిపిస్తే నా కాంగ్రెస్ స్నేహితులు పాకిస్తాన్కు వెళ్లవచ్చు. మన వైమానిక దళం ఎంతమందిని అంతమొందించారో అక్కడి వాళ్లను అడిగి.. వారే శవాలను లెక్కించవచ్చు" అని విమర్శించారు.