40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రవాద దాడి భారతీయుల హృదయాలను కలచివేస్తోంది. మృతుల కుటుంబాలను ఆదుకోడానికి ధనికుల నుంచి సామాన్యుల వరకు అనేకమంది ముందుకొస్తున్నారు. కొందరు గాజలు కూడా అమ్మి మరీ సాయం చేస్తున్నారు. చనిపోయిన ఓ యాచకురాలి డబ్బులను ఆమె తరఫు ట్రస్టీలు పుల్వామా అమరులకు ఇవ్వడం తెలిసిందే. తాజాగా ఓ అంధుడు ఏకంగా రూ. 110 కోట్ల సాయం చేస్తానని ముందుకొచ్చాడు.
రాజస్తాన్లోని కోటకు చెందిన 44 ఏళ్ల ముర్తాజా హమీద్ అంధుడు. ప్రస్తుతం ముంబైలో వ్యాపారం చేస్తున్నాడు. కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన హమీద్ పరిశోధక శాస్త్రవేత్తగానూ పనిచేస్తున్నాడు. పుల్వామా అమరుల కుటుంబాలకు తన సంపాదనలోంచి రూ. 110 కోట్లను ప్రధానమంత్రి సహాయ నిధికి ఇస్తానని పీఎంఓ ఆఫీసుకు లేఖ రాశాడు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని అడగ్గా.. ‘మాతృభూమి కోసం ప్రాణాలు ధారపోసిన వారిని ఈ దేశ ప్రజలు గుర్తించుకోవాలి.. ’ అని బదులిచ్చాడు.