ఇస్లామాబాద్, మార్చ్ 3: పాకిస్తాన్ పై భారత విమాన దళాలు దాడులు చేసింది నిజమే అని జైషే మొహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ తాజాగా వెల్లడించారు. ఐఏఎఫ్ దాడులు జరిపిన తర్వాతి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఇలా ఉంది...‘‘బాలాకోట్లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే... కాని జిహాద్ బోధనా కేంద్రంపై మాత్రమే దాడులు జరిగాయని అమర్ చెప్పారు. అంతేకాక భారత్ చెప్తున్నట్లు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. ఈ చర్యతో తమకు భారత్ ప్రతీకారానికి మంచి అవకాశం ఇచ్చిందన్నాడు. తమపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్విందని అమర్ వ్యాఖ్యానించాడు. కాశ్మీర్ ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారికి సర్జికల్ స్ట్రైక్స్ మరింత కోపం తెప్పించాయని పేర్కొన్నాడు.