న్యూఢిల్లీ. మార్చ్ 2: గత కొద్ది సంవత్సరాలుగా రుణ ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా జెట్ ఎయిర్వేస్ కు మరో ఊహించని షాక్ ఇచ్చింది. సాధారణంగా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ విమానం ఏదైనా కారణాల వల్ల రద్దయితే ఆ ప్రయాణికులను వేరే సంస్థల విమానాల్లో గమ్యస్థానాలకు చేరుస్తారు. అందుకు గానూ ప్రయాణికులను తీసుకెళ్లిన విమానయాన సంస్థకు రద్దైన విమానయాన సంస్థ చెల్లింపులు చేస్తుంది. అయితే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ విమాన ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఎయిర్ ఇండియా నిరాకరించింది. కాగా ఇక నుండి జెట్ ఎయిర్వేస్ ప్రయాణికులను తాము అలా తీసుకెళ్లబోమని ఎయిర్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేసింది.