హైదరాబాద్, ఫిబ్రవరి 28: టీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో నూతనగా ఏర్పడగా, ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని 31 జిల్లాలుగా చేసిన విషయం తెలిసిందే. కాగా, రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తాజాగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ నుండి నారాయణపేట, ఉమ్మడి వరంగల్ నుండి ములుగు లను జిల్లాలు చేశారు.
కాగా, కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట్ జిల్లా కలెక్టర్గా ఎస్. వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్గా సి. నారాయణరెడ్డిని నియమించింది. ప్రస్తుతం వెంకట్రావ్ మహబూబ్నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్నారు. నారాయణపేట్ జిల్లా ఏర్పాటుతో ఆయన కలెక్టర్ గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ములుగు, నారాయణపేట్ లను జిల్లాలు చేస్తామని హామీ ఇవ్వగా, మాట ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.