న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది భారత సైన్యం. అయితే ఈ దాడి కేవలం ఉగ్రవాద శిబిరపై మాత్రమే జరిపారు, అయిన కూడా పాక్ తీవ్ర ఆగ్రహంతో, ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత్ గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. కాగా, వాటిని భారత్ వాయుసేన తరిమి కొట్టింది. ఈ ఘటన తరువాత ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కాగా, ఈ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని అగ్రరాజ్యం సూచించింది. గత రాత్రి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫోన్ చేసిన అమెరికా కార్యదర్శి మైక్ పోంపెయో, పాక్ భూభాగంలోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడులను సమర్థించారు. జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు చేయాలన్న భారత్ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఏ దేశము సహించదని, ఉగ్రదాడులను భరిస్తూ ఏ దేశమూ ఇంకెంత కాలమూ సంయమనం పాటించలేదని ఈ సందర్భంగా మైక్ పేర్కొన్నారు. కాగా, మరోవైపు పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే చీఫ్ మసూద్ అజర్పై నిషేధం విధించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరాయి.