హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభలో కేసీఆర్ మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో తనకు మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. 2001లో కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో పద్మారావు చేరారని, జంటనగరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేత అని కితాబిచ్చారు. జంటనగరాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని అభినందించారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ఆయన ఒకేలా ఉంటారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పద్మారావు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కేసీఆర్ చెప్పారు.