జైపూర్, డిసెంబర్ 19: రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రూ.2 లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రాజస్థాన్ ప్రభుత్వంపై 18వేల కోట్ల భారం పడనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సఫలీకృతమైంది. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రుణాలను మాఫీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిందని బీజేపీ పార్టీ భావిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా ఇప్పటికే రుణాలను మాఫీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఛత్తీస్గర్లో కూడా రైతు రుణాల మాఫీ ప్రక్రియకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి వచ్చిన ఈ మూడు రాష్ట్రాల్లో రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హామీని నిలబెట్టుకుంది.