ఢిల్లీ, మే 11 : సుప్రీంకోర్టు కొలీజియం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఎం.జోసఫ్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అంశంపై తీవ్రంగా చర్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ సహా కొలీజియంలోని ఐదుగురు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చర్చించారన్న అంశంపై అధికారిక సమాచారం లేకున్నా.. కేంద్రంతో ఎలా వ్యవహరించాల్సిన తీరుపై ముందుకెళ్లాలన్న దానిపై గంటపాటు చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదోన్నతి కోసం జస్టిస్ జోసఫ్ పేరు సిఫార్సు చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇతర న్యాయమూర్తుల పదోన్నతులకు సిఫార్సు సమయంలో జస్టిస్ జోసఫ్ పేరునూ పంపించాలని సూచించారు. జస్టిస్ కె.ఎం.జోసఫ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సులను గత నెలలో కేంద్రం తిప్పి పంపించిన క్రమంలో తాజా చర్చ జరిగింది.