అనంతపురం, మే 6 : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె స్నేహలత, హర్షల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో అత్యంత వైభవంగా జరిగింది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర స్వగ్రామం వెంకటాపురంలో భారీ సెట్టింగ్తో వేదిక ఏర్పాటు చేసి బంధువులు, పరిటాల అభిమానులు, రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి కుమార్తె స్నేహలతను ఆమె సోదరులు పరిటాల శ్రీరామ్, సిద్దార్ధలు ఇంటి నుంచి పెళ్లి వేదిక వద్దకు హంసవాహన పల్లకిలో తీసుకొచ్చారు. భారీగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద అతిథులు ప్రత్యేకంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడంతో దాదాపు 30వేల మంది వరకు వివాహ వేడుకను తిలకించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అతిథులతో వెంకటాపురం గ్రామం కిక్కిరిసి పోయింది. రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసులు, సుజయ్కృష్ణ రంగారావు, అమర్నాథరెడ్డి, తదితరులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.